ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU PURANA STORIES OF GODDESS SRI KANAKA DURGA - DASARA FESTIVAL SPECIAL STORY OF GODDESS SRI KANAKA DURGA AVATHARS


ఓంకార పంజర శికీ ముననిష దుద్యాన కేళికల కంఠీమ్ ! ఆగమ విపిన మయూరీ మర్యామంతర్విభావ యే గౌరమ్ !! భక్త్యాస్నాత్యాత్ర మల్లీశం దుర్గం దుర్గారి నాశినీం దృష్ట్యా పాపాత్ ప్రముచ్యేత్ దేవలోకే వసేత్సాదా!!
బ్రహ్మదేవుని ముఖం నుంచి., పద్మరాగమణిద్యుతులతో.,సమశతోష్ణకాంతులు జల్లుతూ, ఆకృతి దాల్చిన రజోగుణమా అన్నట్టు ఒక తేజోరాశి అవతరించింది. పరమశివుని ముఖం నుంచి రజతకాంతులీనుతూ.. కన్నులు మిరుమిట్లు గొలిపే ప్రభలతో, భీకరంగా, పర్వతాకారంగా, మూర్తీభవించిన తమోగుణమా అన్నట్టు ఒక తేజోరాశి ఉద్ధవించింది. శ్రీ మహావిష్ణువు ముఖం నుంచి నీలిరంగు కాంతులతో, రూపు దాల్చిన సత్త్వగుణమా అన్నట్టు హిమానీరాకాసుధాసదృశ శీతల తేజస్సుతో ఒక తేజోరాశి ఆవిర్భవించింది. ఇలా ఇంద్రాది దేవతలందరి ముఖాలనుంచీ చిత్ర విచిత్ర వర్ణాలతో రకరకాల తేజోమూర్తులు అవతరించాయి. ఆ తేజోమూర్తులన్నీ కలిసి ఒక మహాతేజోమూర్తిగా రూపుదాల్చాయి. సకలదేవతేజో సముద్ధూత అయన ఆ స్త్రీ మూర్తి అపురూప సౌందర్యరాశి. ఆమె సృష్టిస్థిత్యంతమాతృక. సర్వ వ్యాపకురాలైన ఆమె సాకార నిరాకార, సగుణ, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప. ఏకరూప అయిన ఆమె, దేవకార్యసిద్ధి కోసం ఈ రూపం ధరించింది.
శంకరుని తేజస్సు...ఆమె ముఖకమలం అయింది.
యముని తేజస్సు...కుటిల నీలాలక కుంతలాలు(ఉంగరాల జుత్తు) అయింది.
అగ్నిదేవుని తేజస్సు...కృష్ణశ్వేతరక్త వర్ణాలుగల మూడు కన్నులయ్యాయి.
ఉదయ ప్రాతస్సంధ్యా తేజస్సులు...మన్మథ చాపాన్ని మరపించే ఆమె కనుబొమలు అయ్యాయి.
వాయుదేవుని తేజస్సు... ఆమె కర్ణాలయ్యియి.
కుబేరుని తేజస్సు...నువ్వుపూవును మరపించే ఆమె నాసిక అయింది.
ప్రాజాపత్య తేజస్సుతో...మల్లెమొగ్గల్లా ప్రకాశించే దంతాలయ్యాయి
సూర్యుని తేజస్సుతో... క్రింది పెదవి - కార్తికేయుని తేజస్సుతో...పై పెదవి ఏర్పడ్డాయి.
విష్ణువు తేజస్సుతో...అష్టాదశ భుజాలు(పదునెనిమిది చేతులు) ఏర్పడ్డాయి.
వసువుల తేజస్సుతో...ఆమె చేతులకు చిగురుటాకుల్లాంటి వేళ్ళు ఏర్పడ్డాయి.
చంద్రుని తేజస్సు...చక్కని వక్షోజద్వయమైంది.
ఇంద్రుని తేజస్సుతో...మూడు మడతలు గల మధ్యభాగం(పొట్ట) ఏర్పడింది.
పృథ్వీ తేజస్సుతో... ఆమెకు విశాల జఘనం ఏర్పడింది.
వరుణుని తేజస్సుతో... ఆమెకు కాళ్ళు ఏర్పడ్డాయి.

ఇలా సర్వావయవ సౌందర్యశోభతో, శుభాకార, సుస్వర, సురూప అయిన ఆ స్త్రీమూర్తిని చూసి సకల దేవతలు మహదానంద భరితులయ్యారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలందరి వంక చూసి..,‘మీమీ ఆభరణాలు, ఆయుధాలు ఆ మహాదేవికి కానుకగా బహూకరించండి’ అని ఆదేశించాడు. క్షీరసాగరుడు...ఎర్రని పట్టు వస్త్రాలను, సువర్ణ హారాన్ని,కోటిసూర్యప్రభాసితమైన చూడామణిని, రత్నమయ కుండలాలను, కడియాలనూ బహూకరించాడు.
విశ్వకర్మ...నవరత్న మణిమయ కేయూర, కంకణాలను సమర్పించాడు.
త్వష్ట...సుస్వర, సుమధురంగా ధ్వనించే నూపురాలను కానుకగా ఇచ్చాడు.
మహాసముద్రుడు...కంఠాభరణాలను, ఉంగరాలనూ బహూకరించాడు.

వరుణుడు...నిత్య నూతనంగా ఉండే పద్మాలతో, సుగంథ సంభరితంగా ఉండే దివ్య వైజయంతీమాలను సమర్పించాడు. హిమవంతుడు...నానావిధ రత్నాలతోపాటు బంగారు కాంతులీను సింహాన్ని ఆమెకు వాహనంగా సమర్పించాడు.
శ్రీహరి...తన సుదర్శన చక్రం నుంచి మరొక చక్రాన్ని సృష్టించి ఇచ్చాడు.
శివుడు...తన త్రిశూలం నుంచి మరొక త్రిశూలాన్ని సృష్టించి ఇచ్చాడు.
వరుణుడు...శ్వేత చంద్రికలు వెదజల్లే శంఖాన్ని, పాశాయుధాన్ని సమర్పించాడు.
అగ్నిదేవుడు...శతఘ్నిని బహూకరించాడు.
వాయువు...దివ్య దనుస్సును, అక్షయతూణీరాలను సమర్పించాడు.
దేవేంద్రుడు...తన వజ్రాయుధం నుంచి మరొక వజ్రాయుధాన్ని సృష్టించి ఇచ్చాడు.
యముడు...కాలదండాన్ని, ఖడ్గాన్ని, చర్మంతో చేసిన డాలును బహూకరించగా..,
బ్రహ్మదేవుడు పవిత్ర గంగాజలపూర్ణమైన కమండలాన్ని కానుకగా ఇచ్చాడు.
విశ్వకర్మ...గండ్రగొడ్డలిని బహూకరించాడు.
కుబేరుడు...సురాపూర్ణమైన సువర్ణపాత్రను సమర్పించాడు.
త్వష్ట...చిరుగంటలు పొదిగిన కౌమోదకి అనే గదను, దివ్యాస్త్రాలను, అభేద్యమైన కవచాన్ని కానుకగా ఇచ్చాడు.
సూర్యుడు...తన తేజస్సులను బహూకరించాడు.

ఇలా దివ్యాభరణాలతో..నానావిధ ఆయుధాలతో విరాజిల్లుతున్న ఆ జగజ్జనని చూసి సకల దేవతలు పరమ సంతుష్టులై ఇలా కీర్తించారు.
నమః శివాయై కల్యాణ్యై శాంత్యై పుష్ట్యై నమోనమః
భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః 
కాళరాత్ర్యై తథాంబాయా ఇంద్రాణ్యై తే నమోనమః
సిధ్ధ్యై బుద్ధ్యై తథా వృద్ధ్యై వైష్ణవ్యై తే నమోనమః

ఆ సర్వమంగళ, ఆ చతుర్దశ భువనాధీశ్వరి, ఆ జగజ్జనని, ఆ త్రిలోకైక వందిత, ఆ పరమపావని, ఆ కరుణా రసపూర్ణ త్రిలోచని, ఆ ఆర్తత్రాణపరాయణి, సకల దేవతల వంక చిరునవ్వులు చిందిస్తూ చూసి, అభయాశీస్సులు అందించింది.
కృష్ణానదీ తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి వున్న కనక దుర్గామాత స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం వుంది. ఈ చక్రానికి అగస్త్యల వారు తమ తపః ఫలాన్ని ధారపోశారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్రరూపంలో వుండేదని, ఆదిశంకరులు విచ్చేసి శ్రీ చక్రంలోని రౌద్రబీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి ఆయి తనను దర్శించే భక్తులు కోరికలు నేరవేరుస్తునదని చెబుతారు. కనకదుర్గా క్షేత్రమహత్యాన్ని తెలిపే పురాణ గాథలు పరిశీలిద్దాం. ఇంద్రకీలాద్రి కథ :- ఈ కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై స్థిరనివాసం ఏర్పరచుకొని భక్తులను ఈడేరుస్తోంది. కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై వెలసి వుండడానికి ఒక కథ వుంది. దుర్గామాత ఆలయం వున్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు. అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ వుండేవాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీపరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగాఇంద్రకీలుడు వరం కోరాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గ ఎనిమిది బాహువుల్లో ఎనిమిది ఆయుధాలు కలుగి, సింహాన్ని అధిష్టించి మహిషాసురోత్తమాంగాని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది. ఆరి, శంఖ, కేత, శూల, పాశ, అంకాశ, మౌర్వి, శౌనకాలనేవి దుర్గాదేవి బాహువుల్లోను ధరించే ఎనిమిది ఆయుధాలు, ఈ దేవీమూర్తికి ఎడమభాగంలో శ్రీ చక్రం స్థాపించబడి వుంది. ఆ శ్రీ చక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి వుంది, ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీ చక్రానికి జరుగుతాయి. ఆ దేవీమూర్తికి గల మకరతోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి వున్నాయి. శ్రీశైల, బ్రహ్మచారిణి, చండ, మష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు. మహిషాసుర సంహారం :- పూర్వకాలంలో దనువు పుత్రులైన రంభకరంభులనే వారు సంతానంకోసం ఈశ్వరుని గూర్చి ఘోరతపస్సు చేశారు. కరంభుడు నీటిలోను, రంభుడు చెట్టుపైన కూర్చుని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంభుని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి సమకట్టాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. 'పుత్రసంతతిలేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రునిగా జన్మించాలి. ఈ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదవేదాంగవిధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావలి' అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరాడు. ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు. రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశంతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. చూలు నిండాక మహిషాకారంతో బిడ్డ జన్మించాడు. అతడే మహిషాసురుడు. అతను మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలన్మి గజగజలాడిస్తూ లోకకంటకుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షిశిష్యుని బాధిస్తూ వుండడంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్దిస్తుందని శపించాడు. అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీ సాధుపుంగవులని, దేవతలనీ, ఋషులను బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి 'ఉగ్రచండి' అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది. మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రంభుడి పుత్రునిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలనీ పీడిస్తూవుంటే, ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి 'భద్రకాళి' రోపంలో అవతరించి మహిషుని ముట్టుపెట్టింది.మూడవ జన్మలో ఈ మహిషుడు ఘోరతపస్సు చేసి బ్రహ్మ వసువరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకపీడితుడయ్యాడు. ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపట్టి తల నరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన కలవచ్చింది. అందుకు కంపితుడై మహిషుడు భద్రకాళిని గూర్చి ఘోరతపస్సు చేశాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమైంది. ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని, నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞభాగార్హత కలగజేయవలసిందని మహిషుడు కోరాడు. 'మహిషా! నువ్వు రుద్రాంశసంభవు. నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఇక నువ్వు నా వాహనంగా వుండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచివుంటాను' అని దేవి పలికింది.ఆ తర్వాతా మహిషుడికి మళ్ళి జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసుర చేష్టలకు పూనుకొని దేవతలని, మునులని పీడిస్తూ వుండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గామాత రూపం ధరించి సపరివారుడైన మహిషాసురుని సంహరించింది. శంభు నిశంభుల కథ :- మహిషాసురుని వలె అతి క్రౌర్యంగా వ్యవహరించిన శంభు నిశంభులనే రాక్షసులను దుర్గామాత వధించిన గాథ పురాణాల్లో చెప్పబడి వుంది. పూర్వం శంభునిశంభులనే రాక్షసులు ఇంద్రాది దేవతల్ని పదవీభ్రష్టుల్ని చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాల్ని బాధించసాగారు. అప్పుడు దేవతలంతా దేవిని ప్రార్థించారు. వారి మొర ఆలకించిన దేవి శరీరం నుంచి దివ్యతేజోరూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది. శంభునిశంభుల సేవకులైన ఛండాముండలు ఈ అపురూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలిపారు. తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయబారం పంపారు. శంభునిశంభులు. తనతో యుద్ధంచేసి తనను జయించిన వానినిగాని, తనతో సమాన బలపరాక్రమశాలిని గాని తాను పెళ్ళి చేసుకుంటానని ఆ కన్య బదులు చెప్పింది. ఆ మాటలు విన్న శంభునిశంభులు కోపోద్రిక్తులై ఆ కన్యను పట్టిదెమ్మని తమ సేనాధిపతి ధూమ్రలోచనుడిని పంపారు. తనపై దండెత్తిన ధూమ్రలోచనుడిని, అతని సైన్యాన్ని దేవి సంహరించింది. ఆ రుధిరమంతా దేవి వాహనమైన సింహం త్రాగింది. ఈ వార్తవిన్న శంభునిశంభులు చతురంగ బలాలని సమకూర్చుకొని దేవిపై యుద్ధం ప్రారంభించారు. వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపచేసి భ్రూమధ్య నుంచి ఖడ్గం, పాశం మొదలయిన ఆయుధాలు సృష్టించి వాటితో రాక్షస గణాన్ని శంభునిశంభులని నిమేషకాలంలో హతమార్చింది. దుర్గాసుర సంహారం :- ఇలాగే దుర్గాసురుణ్ణి దేవి సంహరించిన కథ కూడా పురాణాల్లో పేర్కొనబడివుంది. పూర్వం దుర్గాసురడనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. ఆ వర గర్వతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలను గడగడలాడించసాగాడు. ఇంద్రాది దేవతలు అప్పుడు పరాశక్తికి మొరపెట్టుకోగా ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది. ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందడం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతలు స్తుతించారు. దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసం, వరుణినిచేత శంఖం, అగ్నిచేత బల్లెం, వాయువుచేత బాణాలు అంబులపొది, ఇంద్రునిచేత వజ్రాయుధం, బ్రహ్మచేత అక్షమాల, సూర్యునిచేత కిరణాలు, శివుని చేత సింహ వాహనం పొందింది. స్కందపురాణం సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు పొందుపరచబడి వున్నాయి. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపురసుందరి, లలితాత్రిపురసుందరి, రాజరాజేశ్వరి, చిచ్ఛక్తి రూపమైన కుండలినీ మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి.