ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

THE HISTORY OF LAST NIZAM KING - MEER USMAN ALI KHAN - IN TELUGU


చివరి నిజాం రాజు ‘మీర్ ఉస్మాన్ అలీ ఖాన్’ గురుంచి తెలియని చరిత్ర

1. చివరి నిజాం పాలన లో రజాకార్ల అరాచకాల గురుంచి.. అలాగే అతని అభివృద్ధి పనుల గురుంచి మనకు తెలిసిందే. అయితే చాలా మంది కి తెలియని మరి కొన్ని ముఖ్య విషయాలు ఇక్కడ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

2. 1911లో తండ్రి మరణానంతరం ఉస్మాన్‌ రాజ్యానికి వచ్చాడు. 1948లో సింహాసనం వదిలిపెట్టాడు. నిజాం కి దాదాపు 50 మంది భార్యలు & వందల్లో ఉంపుడు గత్తె (కీప్) లు ఉండేవారు (వీరి సంఖ్య కరెక్ట్ గా ఎంత ఉంది అనే విషయంలో చరిత్ర కారులలో స్పష్టత లేదు, నిజాంకి కూడా స్పష్టత లేదు అని కొందరు రాసారు)

3. అప్పట్లోనే దేశ నగరాల్లో హైదరాబాదు 5 వ స్థానం లో ఉండేది. (హైదరాబద్ లో “కమాల్ ఖాన్” అనే వ్యాపారి కట్టుకున్న భవంతి ‘కింగ్ కోటి’ లో తన వందలాది మంది కుటుంబ సభ్యులతో నిజాం నివసించే వాడు) అయితే మిగిలిన తెలంగాణా ప్రాంతమంతా అధమ స్థానంలో ఉండేది. జిల్లా కేంద్రాల పరిస్థితి కూడా అతి దీనంగా ఉండేది. దీన్ని బట్టి గ్రామాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో ఊహించుకోగలము.

4. ప్రజల తలసరి తలసరి ఆదాయం, ప్రజలకు అందే విద్య, వైద్య సౌకర్యాలు, శాంతిభద్రతలు, ప్రజల హక్కులు, అధికారుల దాష్టీకంపై నియంత్రణ... ఇలాంటి వన్నీ అత్యంత అధ్వానంగా ఉండేవి.

5. పన్నులు వడ్డించే తీరు అత్యంత అన్యాయం గా ఉండేది.

6. 1914లో నిజాం రాజ్యంలో అక్షరాస్యత కేవలం 2.8% ! చదువుకున్నవాళ్లు తనకు ఎదురు తిరుగుతారన్న భయం కొద్దీ నగరంలో తప్ప వేరెక్కడా కాలేజీలు, హైస్కూళ్లు లేకుండా చేశాడు. గ్రామాలో బళ్లు వుండేవి కావు. పట్టణాలలో వున్నవి కూడా స్థానికుల మాతృభాషలో కాదు, ఉర్దూ మీడియంలో!

7. పదవి చేపట్టగానే ఉస్మాన్‌ వెట్టి చాకిరీని, దేవదాసీ వ్యవస్థను నిషేధించాడు. సంపన్నులు ఆడే కోడిపందాలు, ఎడ్లపోటీలను కట్టడి చేశాడు. ప్రభుత్వోద్యోగుల కోసం జమీందారులు ఏర్పరచే గానాబజానాలను నిషేధించాడు. కోర్టు గదుల్లో పొగతాగడం నిషేధించి డ్రస్‌ కోడ్‌ విధించాడు. (ఈ నిషేధాలన్నీ ప్రజలకోసమే. తను మాత్రం వ్యక్తిగత స్థాయిలో ఏ సుఖాన్నీ వదులుకోలేదు)

8. అజంఠా, ఎల్లోరా గుహల్లోని చిత్రాలు కాపాడడానికి చర్యలు తీసుకున్నాడు. హైదరాబాదులో హైకోర్టు కట్టించాడు. మూసీనది పొడవునా కరకట్టలు పటిష్టపరిచాడు. మూసీపై డ్యామ్‌ను నిర్మించాడు. ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ తవ్వించాడు. వీధులు విస్తరించాడు. సిమెంటు రోడ్లు వేశాడు. 1000 కెవి థర్మల్‌ స్టేషన్‌ నెలకొల్పారు. నగర అభివృద్ధికోసం ట్రస్టును ఏర్పరచాడు. తన రాజ్యాన్ని సముద్రం అవతలికి విస్తరించాలంటే సముద్రతీరానికి మార్గం వుండాలని యోచించిన నిజాం మడగావ్‌ రేవుకు చేరడానికై హైదరాబాదు నుండి గదగ్‌కు రైల్వే లైను వేయించాడు.

9. తెలంగాణా లోని మొత్తం భూమి లో సారవంతమైనది 40% ఉండేది ఈ భూమి అంతటికి యజమాని నిజామే.. మిగిలిన 60% భూమిలో సింహ భాగం జాగిర్దార్ ల ఆధిపత్యం కింద ఉండేది. వీరు నిజాం కి తరుచుగా భారీ నజరానా లు సమర్పిస్తుండే వారు. 1935 నాటికి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యాయి. నిజాం కట్టించిన ప్రాజెక్టుల్లో తలమానికమైన నిజామాబాద్‌లో నిజాం సాగర్‌, మహబూబ్‌నగర్‌లో కోయిల్‌ సాగర్‌, ఖమ్మంలో వైరా, పాలేరు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మద్రాసు రాష్ట్రంతో తుంగభద్ర జలాల పంపిణీపై 80 ఏళ్లగా నానుతున్న సమస్య ఒక కొలిక్కి వచ్చి సామరస్యంగా పరిష్కారమైంది. మరిన్ని ఎకరాల భూమి సాగులోకి వచ్చింది.

10. పన్నుల రూపం లో వసూలు చేసిన సొమ్ము నుండి పెద్ద మొత్తం రాజభరణం గా స్వీకరించేవాడు. అంతేకాదు, నజరానాల రూపంలో పదవులు ఆశించే జమీందార్ల నుండి, ఉద్యోగార్థుల నుండి బోల్డంత డబ్బు, కానుకలు వసూలు చేసేవాడు. నజరానా చెల్లించినవారు అసమర్థులైనా, అవినీతిపరులైనా సరే పదవులు యిచ్చేసేవాడు.

11. రాజ్య పరిస్థతి తెలుసుకోవడానికి తొలినాళ్లలో రాజ్యంలో పర్యటనలు చేసిన నిజాం తర్వాతి రోజుల్లో కానుకలు వసూలు చేసుకోవడానికి మాత్రం వెళ్లేవాడు.

12. ఉస్మానియా యూనివర్శిటీ పెట్టాడు కానీ దానిలో బోధనా భాష ఏది? జనాభాలో 14% మాట్లాడే ఉర్దూ! తెలుగు (48%), మరాఠీ(26%) , కన్నడ (12%) భాషలకు దానిలో చోటు లేదు.

13. ప్రజల్లో 85% మంది హిందువులు, 12% మంది ముస్లిములు వుంటే ఉద్యోగులలో అధికశాతం ముస్లిములే. వారు కూడా యితర ప్రాంతాల నుండి వచ్చినవారు.

14. సిద్దిక్‌ దీన్‌దార్‌ అనే వ్యక్తి మతమార్పిడులను ప్రోత్సహిస్తూ ఉద్యమం నడిపాడు. సిద్దిక్‌ చర్యలకు తమకు సంబంధం లేదని ప్రభుత్వం ప్రకటించింది కానీ హిందువులు నమ్మలేదు. ఈ వివక్షతకు, మతమార్పిడికి వ్యతిరేకంగా ఆర్యసమాజ్‌ 1937 నుండి పోరాడసాగింది.

15. ఎలాటి ఉద్యమకారులైనా సరే అంతిమంగా తన అధికారానికి ముప్పుగా తయారవుతారని అతని భయం. వీళ్లని జైల్లో పెట్టాడు. పత్రికలు పెట్టనిచ్చేవాడు కాడు. సభలు జరపనిచ్చేవాడు కాడు. జమీందార్ల ద్వారా ప్రజలను అణచివేసేవాడు. వారి స్వేచ్ఛను హరించాడు. రాజ్యంలో మూడోవంతు జాగీర్ల రూపంలో వుంది. రాజ్యం యొక్క మొత్తం ఆదాయం 8 కోట్ల రూపాయలుంటే దానిలో 70% ఆదాయం 19 మంది జాగీర్దార్లకు వచ్చేది. జాగీర్దార్లు తమ సొంత ప్రాంతాలలో ప్రభుత్వ ప్రాంతాలతో పోలిస్తే పది రెట్ల పన్నులు వసూలు చేసేవాళ్లు, ప్రజలను పీడించేవారు. వెట్టి చాకిరీ మళ్లీ వచ్చేసింది. నజరానాలు ముడుతున్నందున నిజాం నోరెత్తేవాడు కాడు.

16. 1940 తరువాత నల్లమందుకి అలవాటు పడ్డాడు. ఏ దివాన్‌ను సవ్యంగా పాలించనివ్వలేదు. ఇంతలో రెండవ ప్రపంచయుద్ధం వచ్చింది. బ్రిటన్‌కు విపరీతంగా సహాయం చేసి వాళ్ల ఆదరాన్ని మరింతగా పొందాడు. భారతదేశం నుండి విడిచిపెట్టే రోజు వస్తే తన రాజ్యం తనకు అప్పగించి వెళతారని నమ్మాడు.

17. కాంగ్రెసు అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం వస్తుందని, అది నిజాం రాజ్యం పొలిమేరల్లోకి రాకుండా వుండాలని మజ్లిస్‌, నిజాం కోరుకున్నారు. తన రాజరికం కొనసాగడానికి నిజాం మజ్లిస్‌ చెప్పినట్టు ఆడసాగాడు.

18. ఖాశీం రజ్వీ నాయకత్వాన రజాకార్లు చేసిన దోపిడీలు, ఘాతుకాలు అన్నీ యిన్నీ కావు. (ఎన్ని అరాచకాలు చేస్తున్నా నిజాం వాళ్లను ఏమీ అనలేదు). రజ్వీ బంగాళాఖాతం దాకా తన రాజ్యాన్ని విస్తరింపచేస్తాడని ఆశ పెట్టుకుని నిజాం అతని చేతిలో కీలుబొమ్మగా మారాడు. జాగీర్దార్లకు, రజాకార్లకు, కాంగ్రెసువారికి, కమ్యూనిస్టులకు మధ్య తన రాజ్యంలో అంతర్యుద్ధం జరిగినా పట్టించుకోలేదు.

19. తను స్వతంత్ర రాజుగా వెలగాలి. కుదరకపోతే పాకిస్తాన్‌లో విలీనమవ్వాలి. తన రాష్ట్రంలో 85% మంది హిందువులు ఎలా వున్నా తనకు అనవసరం. 1948లో పోలీసు చర్యతో సర్దార్‌ పటేల్‌ నిజాం ఆశలు అడుగంటించాడు. సెప్టెంబర్ 17 నాడు తెలంగాణా ప్రజలకు రాచరికం నుండి విముక్తి దొరికింది. ఇదీ చరిత్ర.