ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ARTICLE ABOUT LORD SRI MAHA VISHNU'S 21 AVATHARS IN TELUGU


ఆదిపురుషుడు శ్రీమన్నారాయణుడి

 యొక్క 21 అవతారాలు.

భగవంతుండగు విష్ణువు

జగముల కెవ్వేళ రాక్షసవ్యథ గలుగున్
దగ నవ్వేళల దయతో
యుగయుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్.
శౌనకాది మునులు, సూతమహర్షిని నారాయణుని కథలు తెలుపమని అడగగా, సకలపురాణ ద్రష్టయైన ఆ మహర్షి, శ్రీమద్భాగవత వక్తయైన శుకమునిని స్మరించి, వ్యాసుని పాదాలకు నమస్కారం చేసి,నరనారాయణులకున్నూ,భారతికిన్నీ మొక్కి ఇలా చెప్పటం మొదలెట్టాడు..."మునీంద్రులారా! సర్వలోకాలకీ మంగళప్రదమైన విషయాన్ని అడిగారు...కర్మనిర్మూలన హేతువులైన ఆ కమలలోచనుని కథలు ఎవడైతే వినడానికి ఇష్టపడతాడో, వాడికి ఇతరమైన విషయాలేవీ రుచించవు...పుణ్యశ్రవణ కీర్తనుడైన ఆ విష్ణువు తన కథలు వినేవాళ్ళ హృదయాల్లో నిలిచిఉండి సర్వశుభాల్నీ కలిగిస్తాడు..అశుభాల్ని పోగొడతాడు....అలాంటి వారికి నిశ్చలమైన భక్తి కలుగుతుంది...భక్తి ఉన్నవాడి మనస్సు అరిషడ్వర్గాలకి చిక్కక సత్వగుణప్రసన్నమై, ఈశ్వరతత్త్వాన్ని తెలుసుకుంటుంది....అలాంటి వారికి సర్వ సంశయనివృత్తికలిగి, సర్వ కర్మలూ నశిస్తాయి......
అగ్ని ఒక్కటే ఐనా, వేరువేరు కట్టెలకి తగిలి మండేప్పుడు వేరువేరుగా కనిపించినట్టు, విశ్వాత్ముడైన ఆ ఆదిపురుషుడొక్కడే ఐనా అతడు దేవ,తిర్యక్, మనుష్య జాతుల్లో అవతరించి లోకాల్ని రక్షిస్తూ ఉంటాడు.....ఆ భువనైకకర్త,బహుసుందరమైన పదునారు కళలతో,పంచమహాభూత భాసితుడై, శుద్ధసత్వుడై, సర్వావయవాలూ,సర్వేంద్రియాలూ వేలకొద్దీ("సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షా సహస్రపాత్" అని పురుషసూక్తం) వెలుగుతుండగా,హార కిరీటకుండలాలు పెక్కువేలతో, సహస్ర శిరస్కుడై పురుషరూపం ధరించి, అపారజలరాశి మధ్య,యోగనిద్రావిలాసియై వెలుగుతూ ఉంటాడు...అది సకలావతారాలకూ మూలమైన శ్రీమన్నారాయణుని దివ్యరూపం....దానిని పరమయోగీంద్రులైనవారు దర్శిస్తారు....ఆ పరమేశ్వరుని నాభికమలంలోనుంచి సృష్టికర్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మ జన్మించాడు....ఆయన అవయవాలనుండే సర్వలోకాలూ సృష్టించబడ్డాయి.......
మొట్టమొదట ఆ శ్రీమన్నారాయణుడు సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులనే నల్వురిపేర బ్రహ్మమానసపుత్రులుగా జన్మించి, బ్రాహ్మణుండై కఠినమైన బ్రహ్మచర్యాన్ని ఆచరించాడు....
రెండవసారి, జగజ్జననం కోసం యజ్ఞవరాహరూపంతో హిరణ్యాక్షుణ్ణి వధించి,ఆ హిరణ్యాక్షుడిచేత రసాతలానికి తొయ్యబడ్డ భూమిని, తన కోరలపై నిలబెట్టాడు.....
మూడవమారు, నారదుడను దేవరుషిగా బ్రహ్మమానసపుత్రుడై, సర్వకర్మనిర్మూలనము, సర్వపాపహారియగు వైష్ణవతంత్రాన్ని చెప్పి,మహతి అనే వీణను పూని నారాయణ కథాగానంతో లోకాల్ని పావనం చేశాడు......
నాల్గవపరి, నరనారాయణ రూపాలతో బదరికావనంలో దుష్క్రరమైన తపస్సొనరించాడు....
ఐదవ అవతారంలో, కర్దమ ప్రజాపతికి, స్వాయంభువమనువు రెండవపుత్రిక దేవహూతికి కపిలాచార్యుడుగా జన్మించాడు.....ఆ కపిలాచార్యుడు, దేవహూతికి పిండోత్పత్తిక్రమాన్ని ఉపదేశిస్తాడు....తత్త్వజ్ఞాన రూపమైన సాంఖ్యయోగాన్ని ఆసురి అనే బ్రాహ్మణునికి ఉపదేశిస్తాడు....
ఆరవ అవతారం దత్తాత్రేయుడు.....అనసూయాదేవియందు అత్రిమహామునికి జన్మించి, అలర్కుడు,ప్రహ్లాదుడు మొదలైన వారికి ఆత్మవిద్యని బోధించాడు....
ఏడవరూపంలో, రుచి ప్రజాపతికి, స్వాయంభువమనువు పెద్ద కుమార్తె ఆకూతికి శ్రీయజ్ఞుడనే పేర జన్మించి, దివ్యమైన ప్రకాశంతో యామాది దేవతలతో కలసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు....
ఎనిమిదవ అవతారం ఋషభుడు......ఈయననే ఉరుక్రముడనీ అంటారు......ఈయన మేరుదేవియందు నాభికి కలిగినవాడు....ఈ అవతారంలో ఆ మహావిష్ణువు సకల విద్ద్వజ్జనులకీ పరమహంస మార్గాన్ని బోధించాడు......
తొమ్మిదవదైన అవతారంలో, ఋషుల కోరికమీద పృథుచక్రవర్తిగా జన్మించి, భూమిని ధేనువుగా చేసి సకల ఓషధులనీ పిదికె.....
పదవది మత్స్యావతారం.....మహా మీనంగా ప్రభవించి చాక్షుష మన్వంతరం అంత్యకాలంలో,వేదాల్ని దొంగిలించిన సోమకుణ్ణి వధించి,సత్యవ్రతుణ్ణి మహీరూపమైన నావనెక్కించి, సప్తర్షులతో,సకల బీజాల్నీ,ఓషధుల్నీ కూడిన ఆ నావని తన మూపు మీద ధరించి రక్షించాడు.....ఆ సత్యవ్రతుడే ఈ కల్పంలో వైవస్వత మనువు......
పదకొండవదైన కూర్మావతారంలో, క్షీరసాగరమథనవేళ ఒరిగిపోతున్న మందరాద్రిని తన వీపుపై నేర్పుగా నిలిపాడు...
పన్నెండవ అవతారం ధన్వంతరి.....క్షీరసాగరమథనంలో చివరిగా అమృత కలశహస్తుడై జన్మించి,దేవవైద్యుడై, సర్వ వైద్యవిద్యలకీ ఒజ్జయై విలసిల్లాడు...
పదమూడవది అసురులని మోహింపజేసి, సురలకి అమృతాహారాన్నందించి,పరమేశ్వరుణ్ణి సైతం మోహింపజేసిన జగన్మోహినీ అవతారం.....
పద్నాల్గవదైన ఉగ్రనరసింహరూపంతో, కనకకశిపుని వధించి,ప్రహ్లాదుణ్ణి రక్షించాడు....
పదిహేనవదైన కపటవామనావతారంతో బలిని మూడడుగులడిగి, ముల్లోకాల్నీ ఆక్రమించాడు....
పదహారవది పరశురామావతారం....కుపితభావంతో, బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని ఇరవయ్యొక్కసార్లు వధించి భూమిని క్షత్రియశూన్యం గావించాడు....
పదిహేడవరూపంలో వ్యాసుడై, అల్పులైన మానవులని కరుణించ, వేదాల్ని విభజించి, అష్టాదశపురాణాల్ని రచించాడు....
పద్ధెనిమిదవ అవతారంలో శ్రీరాముడై, దేవకార్యార్థమై రాజత్వాన్ని పొంది, సముద్ర నిగ్రహనాది పరాక్రమాల్ని ఆచరించాడు....
పందొమ్మిది,ఇరవై అవతారాలైన బలరామ,కృష్ణావతారాలతో భూమి భారాన్ని తగ్గించాడు....
కలియుగాదిలో రాక్షససమ్మోహనంకోసం, కీకటదేశంలో(మధ్యగయా ప్రాంతంలో) జినసుతుడై, బుద్ధ్హుడనే పేర ప్రకాశిస్తాడు...అదే ఇరవై ఒకటవ అవతారం......
చివరగా కలియుగ, కృతయుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణుయశుడనే విప్రునికి కల్కి అనే పేర ఉద్భవిస్తాడు....సర్వమ్లేచ్ఛ సంహారంగావిస్తాడు....." అని వివరించి సూతమహర్షి ఇంకా ఇలా అన్నాడు..
" అతిరహస్యంబైన హరిజన్మకథనంబు
మనుజుఁ డెవ్వఁడేని మాపురేపుఁ
జాలభక్తి తోడఁ జదివిన సంసార
దుఃఖరాశిఁ బాసి తొలఁగిపోవు."