లలితా సహస్రనామ స్తోత్రం
లలితా సహస్రనామ స్తోత్రము, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రము. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి లభిస్తుందని విశ్వాసం కలవారి నమ్మకం.
ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి, అగస్త్యునికి జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉన్నది. లలితా సహస్రనామాన్ని వశిన్యాది వాగ్దేవతలు (వశిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మేధిని, సర్వేశ్వరి, కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు) దేవి ఆజ్ఞానుసారం దేవిస్తుతికోసం పఠించారని చెప్పబడింది. స్తోత్రంలో దేవి కేశాది పాదవర్ణన ఉంది. ఇందులో అనేక మంత్రాలు, సిద్ధి సాధనాలు, యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని, విశ్వసిస్తారు. లలిత (క్రీడించునది)ను స్తుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గ, కాళి, మహాలక్ష్మి, సరస్వతి, భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు. పారాయణం, అర్చన, హోమం వంటి అనేక పూజావిధానాలలో ఈ సహస్రనామస్తోత్రం పఠించడం జరుగుతుంది.
బ్రహ్మాండ పురాణం 36వ అధ్యాయం "లలితోపాఖ్యానం"లో లలితా సహస్రనామ స్తోత్రం ఉంది. ఇందులో లలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగాను, సృష్టిస్థితిలయాధికారిణిగాను వర్ణించారు. శ్రీమహావిష్ణువు అవతారమైన హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించాడు. లలితా పురాణంలో భండాసురుని సంహరించడానికి దేవి అవతరించినట్లుగా వర్ణించారు. ఈ గ్రంధాలలో శ్రీపురమును సూచించే శ్రీచక్రం నిర్మాణం వర్ణించబడింది. ఆదిశంకరులు, భాస్కరాచార్యుడు త్రిశతి, సహస్రనామములకు వ్యాఖ్యానాలు అందించారు.
అగస్త్యమహర్షికి ఉపదేశంలో హయగ్రీవుడు శ్రీలలితాదేవి ఆవాసమైన శ్రీపురాన్ని, పంచదశాక్షరి మంత్రాన్ని మరియు శ్రీయంత్రము, శ్రీవిద్య, శ్రీలలితాంబిక, శ్రీగురుదేవుల ఐక్యతను వివరించాడు. అగస్త్యుడు లలితాసహస్రనామమును ఉపదేశింపమని కోరగా అది గుహ్యమని, అర్హత లేనివారికి ఉపదేశించడం నిషిద్ధమని హయగ్రీవుడు తెలిపాడు. కాని అగస్త్యుడు అర్హత కలిగిన ఋషి గనుక హయగ్రీవుడు అతనికి లలితాసహస్రనామాన్ని ఉపదేశించాడు..