ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TELUGU MAHABHARATHA STORIES - WAR STORIES OF KUREKSHETRA - FIGHT BETWEEN ARJUNA AND KARNA AND END SCENE OF KARNA IN TELUGU


 అర్జునుడి మీద కర్ణుడు నాగాస్త్రమును ప్రయోగించుట

కర్ణుడు తన వద్ద ఉన్న సర్పముఖాస్త్రాన్ని బయటకు తీసాడు. ఆ అస్త్రానికి అధిపతి తక్షకుని కొడుకైన అశ్వసేనుడు. దానిని అర్జునుడిని చంపడానికే దాచి ఉంచాడు. ఇప్పుడు దానిని తీసి సంధించాడు. అర్జునుడి కంఠానికి గురిపెట్టాడు. కాని గురి కొంచెం కిందకు ఉండటం గమనించిన శల్యుడు " కర్ణా ! నీ గురి తప్పుతుంది. అర్జునుడి కంఠానికి సూటిగా గురిపెట్టు " అన్నాడు. తన గురిని అక్షేపించిన శల్యుని మీద ఆగ్రహించిన కర్ణుడు " శల్యా ! నా గురిని ఆక్షేపించే అర్హత నీకు లేదు. చూస్తూ ఉండు ఈ అస్త్రధాటికి అర్జునుడి తల తెగి నేల మీద పడుతుంది " అంటూ సర్పముఖాస్త్రాన్ని ప్రయోగించాడు. తమ వంక నిప్పులు కక్కుతూ వస్తున్న అస్త్రాన్ని చూసి కృష్ణుడు తన బలమంతా ఉపయోగించి రధమును భూమిలోకి అయిదు అంగుళాలు కూరుకుపోయేలా తొక్కాడు. అర్జునుడి కంఠానికి గురిపెట్టిన అస్త్రము గురి తప్పి అర్జునుడి తల మీదగా దూసుకుపోతూ కిరీటాన్ని ఎగురగొట్టింది. ఆ కిరీటాన్ని బ్రహ్మ దేవుడు దేవేంద్రునికి బహూకరించాడు. దేవేంద్రుడు నివాత కవచులను సంహరించిన సమయంలో అర్జునుడికి బహూకరించాడు. ఆకిరీటమే అర్జునుడికి కిరీటి అనే నామాన్ని ఇచ్చింది.

ఇప్పుడది నాగాస్త్ర ప్రభావానికి ధ్వంసం అయింది. అర్జునుడు వెంటనే తెల్లని పాగాను కిరీటంలా చుట్టుకున్నాడు. అర్జునుడి కిరీటమును నేలపడేసిన అస్త్రము తిరిగి అర్జునుడి వైపు దూసుకు వస్తుంది. అది చూసిన అర్జునుడు " ఈ నాగాస్త్రం ఎవరు ఇది నన్ను ఎందుకు తరుముతుంది " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! అప్పుడే మరిచావా ! ఖాండవ వనదహన సమయంలో నీవు అశ్వసేన అనే నాగ కన్య తన తల్లిని రక్షించుకు పోతున్న సమయంలో నీవు ఆ నాగకన్యను చంపావు. ఆమె తరువాత తక్షకుడి కుమారుడుఅశ్వసేనుడిగా జన్మించి నిన్ను చంపడానికి కర్ణుని వద్ద నాగముఖాస్త్రంగా పూజలందుకుంటూ ఉంది. ఇప్పుడు నీవు నీ దివ్యాస్త్రాలతో ఆ నాగ కన్యను సంహరించు " అన్నాడు. వెంటనే అర్జునుడు అశ్వసేనుడిని సంహరించి నాగాస్త్రాన్ని ముక్కలు చేసి కర్ణుడి శరీరం మీద పన్నెండు బాణాలు వేసాడు. తాను ప్రయోగించిన నాగాస్త్రం కృష్ణుడి కారణాన గురి తప్పిందని తెలుసుకుని కర్ణుడు పదమూడు బాణాలను కృష్ణుడి మీద నూరు బాణాలను అర్జునుడి మీద ప్రయోగించాడు. అర్జునుడు ఒకే బాణంతో కర్ణుడి కుండలములు కొట్టాడు. కర్ణుడు బెదరక అర్జునుడిమీద శరవర్షం కురిపించసాగాడు. కర్ణుడి శరములు మధ్యలోనే తుంచి వేస్తున్నాడు అర్జునుడు. కర్ణుడి శరీరం రక్తసిక్తం అయింది.

సూర్యుడు అస్తమించే సమయమూ ఆసన్న మైంది. అప్పుడు యమధర్మరాజు అక్కడకు వచ్చి అదృశ్యరూపంలో ఉండి ఆకాశం నుండి " ఇప్పుడు కర్ణుడి రథం భీమిలోకి కుంగి పోతుంది. కర్ణుడికి అవసాన సమయం ఆసన్నమైంది " అన్నాడు. అది విన్నా కర్ణుడు ధైర్యమును వీడక భార్గవాస్త్రాన్ని స్మరించాడు. కాని అతడికి అప్పుడది గుర్తుకు రాలేదు. పరశురామ శాపం పనిచేయడం మొదలైంది అని తెలుసుకున్నాడు. కర్ణుడు మనసులో " నేను ధర్మపరుడిని ధర్మం నన్ను రక్షిస్తుంది అనుకున్నాను కాని అది అసత్యం అయింది " అనుకున్నాడు. అర్జునుడు కర్ణుని మీద శరములు గుప్పిస్తున్నాడు. కర్ణుడు తన బాహుబలాన్ని నమ్ముకున్నాడు. అర్జునుడు కర్ణుడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. కర్ణుడు ఇంద్రాస్త్రంతో దానిని అడ్డుకున్నాడు. కృష్ణుడు అర్జునుడితో " అర్జునా ! నీ బ్రహ్మాస్త్రం ఎందుకు వృధా అయిందో తెలుసా ! నీవు ఉపాయంతో యుద్ధం చేయడం లేదు. నీవు ఉపాయంతో యుద్ధం చేస్తే కర్ణుడు నీ ముందు నిలబడకలిగిన వాడు కాదు. కనుక శ్రమపడక ఉపాయంతో కర్ణుడిని సంహరించు అన్నాడు. ఇంతలో కర్ణుడు రుద్ర అనే అస్త్రం జపించ సాగాడు. అతడి రధచక్రం భీమిలోకి కుంగి పోయింది. అందు వలన కర్ణుడు రుద్రాస్త్ర ప్రయోగం చేయలేక పోయాడు.